శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఇరువది ఒకటవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 21)
శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ఇరువది ఒకటవ సర్గ తార అలా ఏడుస్తుంటే హనుమంతుడు ముందుకు వచ్చి ఆమెను ఓదారుస్తున్నాడు. “అమ్మా! తారా! మనము చేసిన కర్మలను బట్టి ఫలితాలు వస్తుంటాయి. వాలి తాను చేసిన అకృత్యములకు ఫలితము అనుభవించాడు. దీనికి చింతించి ప్రయోజనము లేదు. ఈ దేహములు నీటి బుడగలు. కాలానుగుణంగా అవి బద్దలు అవుతుంటాయి. అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోవలసిన వారమే. పోయిన వాలి గురించి విచారించే కంటే బతికి ఉన్న అంగదుని క్షేమం గురించి విచారించు. పుట్టిన ప్రతి ప్రాణీ చావక తప్పదు. కాబట్టి చనిపోయిన వారి గురించి ఆలోచించక, నీ శేషజీవితములో శుభం కలగాలని కోరుకో! అదే ప్రస్తుత కర్తవ్యము. ఇప్పటి దాకా ఈ కిష్కింధలో ఉన్న వేలకొలది వానరులు వాలి సంరక్షణలో హాయిగా జీవించారు. ఇప్పుడు వాలి లేడు. స్వర్గమునకు వెళ్లాడు. స్వర్గసుఖములు అనుభవించుచున్న వాలి గురించి దు:ఖించడం అవివేకము. ఈ కిష్కింధలో ఉన్న వేలాది వానరులకు, భల్లూకములకు వాలి మరణానంతరము నీవు, అంగదుడు రక్షకులు. అంగదునికి పట్టాభిషేకము చేస్తాము. నీ సంరక్షణలో అంగదుడు రాజ్యము చేస్తాడు. తదుపరి కార్యక్రమములు నిర్వర్తించమని సుగ్రీవునికి ఆదేశములు ఇవ్వు. ఇప్పుడు అంగదుడు, సుగ్రీవుడు...