శ్రీమద్రామాయణం - సుందర కాండము - నలుబది తొమ్మిదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 49)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
నలుబది తొమ్మిదవ సర్గ
ఠీవిగా సింహాసనము మీద కూర్చుని ఉన్న రావణుని చూచి హనుమంతుడు మనసులో "ఇతడేనా రావణుడు. నన్ను కట్టి తన వద్దకు రప్పించుకున్న వాడు." అని అనుకొన్నాడు. హనుమంతుడు రావణుని నిశితంగా పరిశీలిస్తున్నాడు.రావణుడు ఆ సమయంలో మెరిసిపోతున్న బంగారు కిరీటమును ధరించాడు. వజ్రములు, మణులు పొదిగిన బంగారు ఆభరణములను ధరించాడు. ఎర్రని పట్టు బట్టలు కట్టుకొని ఉన్నాడు. ఒళ్లంతా ఎర్రని మైపూతలు పూసుకొని ఉన్నాడు. ఆ రావణునికి భయంకరమైన పదితలలు ఉన్నాయి. ఆ రావణుడు ఉన్నతమైన ఆసనము మీద కూర్చుని ఉన్నాడు. అతని ఇరు పక్కల స్త్రీలు వింజామరలు వీస్తున్నారు. రావణుని దగ్గర దుర్ధరుడు, ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, నికుంభుడు అనే మంత్రులు ఇరుపక్కల కూర్చుని ఉన్నారు. వీరు కాకుండా ఇంకా కొంత మంది మంత్రులు రావణుని కొలువు కూటములో ఉన్నారు. మంత్రులతో కూడి ఉన్న రావణుని చూచి హనుమంతుడు తన మనసులో ఇలా అనుకున్నాడు.
"ఆహా! ఏమి వీడి తేజస్సు ఏమి రూపము? ఏమి ధైర్యము. ఏమి పరాక్రమము? వీడే కనుక అధర్మ ప్రవర్తన వీడి ధర్మమును అవలంబించిన ఎడల, వీడు సాక్షాత్తు ఇంద్రుని తో సమానముగా దేవలోకమును ఏలదగిన వాడు. కాని ఇతడు తన బలముతో దేవతలను, దిక్పాలకులను తన సేవకులుగా చేసుకున్నాడు. ఇతడి క్రూరకర్మలే ఇతనిని నాశనం చేస్తున్నాయి." అని మనసులో అనుకున్నాడు హనుమంతుడు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము నలుబది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment