శ్రీమద్రామాయణం - సుందర కాండము - ముప్పది ఎనిమిదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 38)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
ముప్పది ఎనిమిదవ సర్గ
హనుమంతునికి సీత పలికిన మాటలలో పొరపాటు ఏమీ లేదు అనిపించింది. "సీతా దేవీ! నీవు పతివ్రతలకు అనుకూలమైన మాటలే చెప్పావు. నాకు చాలా సంతోషంగా ఉంది. స్త్రీవైన నీకు నా వీపు మీద కూర్చుని నా వేగమునకు తట్టుకుంటూ నూరుయోజనముల దూరమును దాటడం చాలా కష్టమైన విషయం. రాముని తప్ప పరపురుషుని తాకను అన్న నీ మాటలు రాముని భార్యవు అయిన నీకే తగును. ఇటువంటి కష్టములలో ఉన్న ఏ స్త్రీ కూడా ఇక్కడి నుండి ఎలా బయట పడాలా అని ఆలోచిస్తుంది కానీ నీ వలె మాట్లాడదు. అందుకే నీ మాటలు నాకు బాగా నచ్చాయి.సీతా దేవీ! నీవు ఇప్పుడు నాతో పలికిన పలుకులు అన్నీ నేను రామునికి యథాతథంగా తెలుపుతాను. అమ్మా! నీకూ, రామునికి మేలు చేయవలెననే తలంపుతో నేను అలా చెప్పానే కానీ వేరు కాదు. నాకు నిన్ను నా వీపు మీద మోసుకొని పోవడానికి తగిన సామర్థ్యం ఉంది అనే నమ్మకంతో చెప్పాను కానీ, ఈ మహాసముద్రమును దాటడం కష్టము అని నాకు తెలుసు. నీవు నాతో పాటు రాముని వద్దకు రావడానికి ఇష్టపడటం లేదు. అందుకని నేను నిన్ను కలుసుకొని మాట్లాడినట్టుగా నాకు ఆనవాలుగా ఏదైనా ఇస్తే నేను దానిని రామునికి ఇస్తాను. అప్పుడే నేను నిన్ను చూచాను, కలుసుకున్నాను, నీతో మాట్లాడాను అని రాముడు నమ్ముతాడు." అని అన్నాడు.
హనుమంతుడు.
హనుమంతుడు.
అప్పుడు సీతా దేవి హనుమంతునితో ఇలా అంది. “ఓ హనుమా! నేను నీకు ఒక విషయం చెబుతాను. అది నాకూ రామునికి మాత్రమే తెలిసిన విషయము. నీవు ఈ విషయమును రామునికి చెబితే రాముడు నమ్ముతాడు. మేము గంగానదీ తీరంలో ఉన్న చిత్రకూట పర్వతము వద్ద ఉంటూ ఉండగా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనను నేను రామునికి చెప్పినట్టు చెప్పు.
“ఓ రామా! మనము చిత్రకూట పర్వతము వద్ద పర్ణశాలలో ఉంటున్నప్పుడు, మనము జలములలో జలక్రీడలాడి అలసిపోయి, తడిసిపోయి కూర్చుని ఉన్నాము. అప్పుడు ఒక కాకి వచ్చి నన్ను తన ముక్కుతో పొడవడం మొదలుపెట్టింది. నేను దానిని చిన్న చిన్న మట్టిపెళ్లలు విసిరి తోలసాగాను. కాని అది నన్ను వదలలేదు. నా దగ్గరకు వచ్చి నన్ను పొడవడం, మరలా పారిపోయి దాక్కొవడం చేస్తూ ఉంది. నాకు ఆ కాకి మీద చాలా కోపము వచ్చింది. ఆ కాకిని తోలడంలో నాకు పై వస్త్రము జారిపోతే నేను దానిని సర్దుకుంటున్నాను. అప్పుడు నువ్వు నన్ను చూచావు. కాకికి భయపడ్డ నన్ను చూచి నీవు ఎగతాళి చేయగా నేను సిగ్గుపడ్డాను. అప్పుడు నాకు నీ మీద కోపం కూడా వచ్చింది. నీవు నన్ను దగ్గరకు తీసుకొని ఓదార్చావు. నాకు కళ్లనిండా నీళ్లు తిరిగాయి. నిద్ర వచ్చింది. నేను నీ ఒడిలో పడుకొని చాలాసేపు నిద్రపోయాను. తరువాత నువ్వు కూడా నా మీద పడుకొని నిద్రపోయావు.
మనము నిద్రపోతూ ఉండగా ఆ కాకి మరలా వచ్చింది. నా శరీరం అంతా తన ముక్కుతో చీరుతూ ఉంది. నా శరీరం నుండి రక్తం వచ్చింది. నా శరీరము నుండి వచ్చిన రక్తపు చుక్కలు నీ మీద పడ్డాయి. అప్పుడు నేను నిన్ను నిద్రలేపాను. నా ఒంటి నుండి రక్తం కారడం చూచి నీకు కోపం వచ్చింది. "ఓ సీతా! నిన్ను ఈ ప్రకారంగా గాయపరచిన వాడు ఎవరు?” అని కోపంగా అడిగావు. నేను దూరంగా ఉన్న కాకిని చూపించాను. కాలి గోళ్లనుండి రక్తం కారుతున్న కాకిని చూచావు నువ్వు.
ఇంతకూ అసలు విషయం ఏమిటంటే ఆ కాకి దేవేంద్రుని కుమారుడు. వాయువుతో సమానమైన వేగము కలవాడు. అది తెలుసుకొని నువ్వు పక్కనే ఉన్న ఒక దర్భను తీసుకున్నావు. ఆ దర్భ ద్వారా బ్రహ్మ అస్త్రమును సంధించావు. దర్భను మంత్రించి కాకి మీదికి విసిరావు. ఆ దర్భ కాకిని తరుముకుంటూ వెళ్లింది. ఆ కాకికి దిక్కుతోచక రక్షణ కొరకు ముల్లోకములు తిరిగింది. కడకు ఆ కాకికి తండ్రి అయిన దేవేంద్రుడు కూడా తాను అశక్తుడను అని అన్నాడట.
అప్పుడు ఆ కాకి తిరిగి తిరిగి నీ వద్దకు వచ్చి శరణు వేడింది. మొదట్లో ఆ కాకిని చంపాలి అనుకున్న నువ్వు, ఆ కాకి వచ్చి నిన్ను శరణు కోరగానే జాలి తలచి దానికి శరణాగతి ప్రసాదించావు. “ఓ కాకమా! నీమీద నేను బ్రహ్మాస్త్రమును ప్రయోగించాను. అది వృధా కారాదు. దానిని ఎవరి మీద ప్రయోగించాలో నీవే నిర్ణయించు" అని అన్నావు. అప్పుడు ఆ కాకి ఇలా అంది. “నీవు సంధించిన బ్రహ్మాస్త్రమును నా కుడికంటి మీదికి మళ్లించు." అని అంది. నీవు వదిలిన బ్రహ్మాస్త్రము శక్తికి, ఆ కాకి కుడి కన్ను పోయింది. ఆ కాకి నీకు నమస్కరించి ఎగిరిపోయింది.
ఓ రామా! కేవలము ఒక కాకి నన్ను హింసించి నందుకు బ్రహ్మాస్త్రమును ప్రయోగించావు కదా! ఇప్పుడు ఒక రాక్షసుడు నన్ను చెరబట్టాడు. ఇప్పుడు ఎందుకు ఊరుకుంటున్నావు. ఈ రాక్షసుని కూడా క్షమించావా! వీడి మీద బ్రహ్మాస్త్రము ఎందుకు ప్రయోగించవు.
ఓ రామా! నీవు వెంటనే వచ్చి శత్రువులను సంహరించి, నన్ను ఈ రాక్షసుని చెరనుండి విడిపించు.
ఓ రామా! నీవు నాకు నాధుడవు. కాని నేను అనాధగా బతుకుతున్నాను.
ఓరామా! అన్ని ధర్మములలో కెల్లా ఇతరుల మీద దయచూపడం ఉత్తమ ధర్మము అని నాకు తెలుసు. ఈ రాక్షసుల మీద కూడా, దయచూపకూడని వారి మీద కూడా, నీ దయా గుణమును ప్రసరింపచేస్తున్నావా!
రామా! నీవు పరాకమ వంతుడవు. నీకు తెలియని అస్త్రములు, శస్త్రములు లేవు. నీవు దేవేంద్రునితో సమానుడవు. నీ శక్తితో పరాక్రమంతో సముద్రములను కూడా ఎండింపచేయగల వాడివి. ఈ రాక్షసుని పట్ల ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నావు. ఈ రాక్షసుల మీద ఎందుకు నీ అస్త్రశస్త్రములను ప్రయోగించడం లేదు. యుద్ధమే సంభవిస్తే ఈ రాక్షసులే కాదు, దేవతలు, దానవులు, గంధర్వులు కూడా నీ ఎదుట నిలువలేరు కదా! అట్టి నీవు నన్ను రక్షించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? పోనీ నీ తమ్ముడు లక్ష్మణునికి అనుజ్ఞ ఇచ్చినా, లక్ష్మణుడు వచ్చి తన పరాక్ర మంతో ఈ రాక్షసుని సంహరించి నన్ను ఈ చెర నుండి విడిపిస్తాడు కదా! మీరు ఇద్దరూ నన్ను ఈ రాక్షసుని చెరనుండి విడిపించడానికి సమర్ధులై ఉండి కూడా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. నన్ను కాపాడటంలో మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే అది మీ తప్పు కాదు. నేనే పూర్వజన్మలో ఏదో పాపం చేసి ఉంటాను. ఆ పాపఫలము అనుభవించే వరకూ నాకు ఈ చెర నుండి విముక్తి లేదు. ఆ కారణం చేతనే మీరు సమర్థులై ఉండి కూడా నన్ను ఈ రావణుని బారి నుండి రక్షించడం లేదు. ఇది నిక్కువము." అని నామాటలుగా రామునికి చెప్పు" అని కన్నీళ్లు కారుస్తూ చెప్పింది సీత.
సీత మాటలు విన్నహనుమంతునికి కూడా దుఃఖము పెల్లుబికింది.
"అమ్మా! సీతమ్మ తల్లీ! నీవు పొరపడుతున్నావు. నీవు ఇక్కడ ఉన్నట్టు రామునికి తెలియదు. నీ వియోగంతో రాముడు ఎంత బాధపడుతున్నాడో నీకు తెలియదు. అన్నగారి దుఃఖమును చూచి, రామునితో పాటు లక్ష్మణుడు కూడా ఎంతగానో శోకిస్తున్నాడు. మన అందరి అదృష్టము కొద్దీ నీవు నాకు కనపడ్డావు. ఇంక నీ కష్టములు అన్నీ గట్టెక్కినట్టే అనుకో! నీ దుఃఖము అంతం అయ్యే రోజు ఎంతో దూరం లేదు. రాముడు, లక్ష్మణుడు నీ గురించి తెలుసుకోవాలని, నిన్ను చూడాలని ఎంతో ఆతురతగా ఉన్నారు. అతి త్వరలోనే రాముడు లంకకు వచ్చి రావణుని సంహరించి నిన్ను అయోధ్యకు తీసుకొని వెళ్లగలడు. అమ్మా! నీవు ఊరట చెందు. రామునికి, లక్ష్మణునికి, సుగ్రీవునికి నేను చెప్పవలసిన సందేశమును వినిపించు." అని సీతను ప్రార్థించాడు హనుమంతుడు.
ఆ మాటలు విన్న సీత తన దు:ఖమును ఉపశమింపజేసుకొని హనుమంతునితో ఇలా అంది.
“హనుమా! కౌసల్యా తనయుడైన రామునికి నేను శిరస్సువంచి నమస్కరించి, ఆయన క్షేమమును అడిగినానని చెప్పు. సుమిత్రా తనయుడైన లక్ష్మణుని కూడా క్షేమమును అడిగానని చెప్పు. లక్ష్మణుడు సామాన్యుడు కాడు. తాను అనుభవించతగిన రాజభోగములు అన్నీ విడిచి అన్నతో కూడా అరణ్యమునకు వచ్చిన త్యాగ మూర్తి. లక్ష్మణుడు రాముని తన తండ్రిగానూ, నన్ను తన తల్లి వలె చూచుకొనే వాడు. ఎల్లప్పుడూ పెద్దలను గౌరవించేవాడు. ఏ కార్యము అప్పగించినా సమర్ధవంతంగా పూర్తిచేసేవాడు. మా మామగారు దశరథునకు చాలా ఇష్టమైన వాడు.
లక్ష్మణునికి నన్ను ఈ దుర్మార్గుడు రావణుడు అపహరిస్తాడు అన్న విషయం తెలియదు. తెలిస్తే రావణుని ఆరోజే అంతమొందించే వాడు. అటువంటి లక్ష్మణుని క్షేమమును అడిగినట్టు చెప్పు.
హనుమా! నా గురించి, నేను ఈ రాక్షసుని చేతిలో పడుతున్న కష్టముల గురించి రామునికి, లక్ష్మణునికి వివరంగా చెప్పు. వారిని సత్వరమే ఇక్కడకు వచ్చేట్టు చెయ్యి. ఆలస్యం చేయవద్దని చెప్పు. రామునికి నేను చెప్పినట్టుగా ఈ విధంగా చెప్పు.
“నాధా! నేను ఇంక జీవించేది ఒక్క మాసము మాత్రమే! మాసము దాటి ఒక్కరోజుకూడా నా శరీరములో ప్రాణములు ఉండవు. ఇది సత్యము. కాబట్టి, నన్ను అవమానించిన రావణుని సంహరించి, నన్ను రక్షించు." అని రామునికి నా మాటగా చెప్పు." అని పలికింది సీత.
అప్పుడు హనుమంతుడు సీతతో ఇలా అన్నాడు. “అమ్మా! సీతా! ఒక్క మాట. నేను నీవద్దకు వచ్చినట్టు గుర్తుగా నీ వద్ద ఉన్న ఆభరణమును ఏదైనా ఇస్తే దానిని రామునికి ఇస్తాను. అప్పుడు నేను నిన్ను చూచినట్టు, కలుసుకున్నట్టు రాముడు నమ్ముతాడు."అని పలికాడు హనుమంతుడు.
వెంటనే సీత తన కొంగున ముడివేసి దాచిన చూడామణిని తీసి హనుమకు ఇచ్చింది. "హనుమా! నీవు నన్ను కలిసినట్టు గుర్తుగా రామునికి ఈ చూడామణిని ఇమ్ము." అని సీత చూడామణిని (శిరస్సున ధరించే ఆభరణము) హనుమంతునికి ఇచ్చింది. హనుమంతుడు దానిని భద్రంగా దాచుకున్నాడు. హనుమంతుడు సీతకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కారము చేసి ఒక పక్కగా ఒదిగి నిలబడ్డాడు. అప్పుడు హనుమంతుని మనస్సులో రాముడు మెదిలాడు. తాను అప్పుడే రాముని వద్దకు పోయినట్టు, సీతమ్మ ఇచ్చిన చూడామణిని రామునికి ఇచ్చినట్టు, రాముడు ఆ చూడమణిని చూచి ఆనందంతో పొంగిపోయినట్టు మనస్సులో ఊహించుకుంటున్నాడు హనుమంతుడు. హనుమంతుని శరీరం మాత్రం అశోకవనములో ఉంది. మనస్సు మాత్రము రాముని చెంత ఉంది.
శ్రీమద్రామాయణము
సుందర కాండము ముప్పది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment