శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - అరువది నాలుగవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 64)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
అరువది నాలుగవ సర్గ
ఇప్పుడు వానరులకు సీత ఎక్కడ ఉందో తెలిసింది. సీత రావణుని రాజ్యమైన లంకలో ఉంది. ఆ లంక దక్షిణ సముద్ర మధ్యలో ఉన్న దీవిలో ఉంది. ఆ దీవి సముద్ర తీరము నుండి నూరుయోజనముల దూరములో ఉంది. ఆ దీవికి ఎలా చేరాలి? అదే ఇప్పుడు వారి ముందు ఉన్న ప్రశ్న. అందరూ సముద్ర తీరంలో నిలబడి సముద్రం వంక చూస్తున్నారు. ఆకాశము భూమి కలిసినట్టు ఉన్న ఆ సముద్రమును చూస్తుంటే ఆ వానరులకు దిగులు పుట్టింది. ఈ సముద్రాన్ని ఎలా దాటాలి! ఇదే వారి అందరి మనసుల్లో మెదిలే ప్రశ్న.
వారికి నాయకుడు అయిన అంగదుడు వారిని చూచి ఇలా అన్నాడు. “మనము ఇలా సముద్రాన్ని చూస్తూ దిగులుపడితే ప్రయోజనము లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. మన మనసులో దిగులు, భయం ప్రవేశిస్తే మనము ఏమీ చెయ్యలేము. ఆ దిగులు భయం మనలను మింగేస్తుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఏమి చెయ్యాలో ఆలోచించండి. " అని పలికాడు అంగదుడు.
కాసేపు అటు ఇటు చూచాడు. మరలా ఇలా అన్నాడు.
“మనలో ఈ సముద్రమును దాటగల సమర్థుడు ఎవరు? ఎవరు నూరుయోజనముల దూరము కల ఈ సముద్రమును దాటగలరు? రాముని కార్యము నెరవేర్చగల సమర్ధుడు ఎవరు? అతడే మనలను అందరనూ సుగ్రీవుని బారినుండి కాపాడగలడు. మరలా మన భార్యాబిడ్డలను చూడటానికి కారణం కాగలడు. లేకపోతే మనం అందరం ఇక్కడ చావడం తప్పదు. మీలో ఎవరికి ఈ నూరు యోజనముల విస్తీర్ణము కల సముద్రము దాటగల సమర్ధత ఉంది?” అని పలికి అందరి వంకా చూచాడు.
వానరులలో ఎవరూ మాట్లాడలేదు. అంతా మౌనంగా ఉన్నారు. మరలా అంగదుడు ఈ విధంగా అన్నాడు. “మీరంతా ఎందుకు ఊరుకున్నారు. ఎవరూ ఎందుకు ముందుకు రావడం లేదు. మీరంతా సామాన్యులు కారు. ఇదివరకు ఎన్నో ఘనకార్యాలు సాధించారు. మీరంతా వీరులు, పరాక్రమ వంతులు. మీకు సాటిరాగల వారు ఈ లోకంలో లేరు. కాబట్టి ఎవరెవరు ఎంతెంత దూరము ఎగరగలరో చెప్పండి!" అని అడిగాడు అంగదుడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము అరువది నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment