శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఏబది ఆరవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 56)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
యాభై ఆరవ సర్గ
అంగదుని నిర్ణయం ప్రకారము వానరులందరూ ప్రాయోపవేశము చేస్తున్నారు. ఆ సమయంలో జటాయువు సోదరుడు సంపాతి అనే పక్షి రాజు వింధ్యపర్వతగుహలలో నివసిస్తున్నాడు. ఈ వానరుల కోలాహలము విని, సంపాతి గుహలో నుండి బయటకు వచ్చాడు. సంపాతి ఆ వానరులను చూచి చాలా సంతోషించాడు. చాలా రోజుల తరువాత తనకు మంచి రుచికరమైన ఆహారము దొరికింది అనుకున్నాడు.సంపాతి ఆ వానరులను చూచి "ఎవరెవరి కర్మఫలములను బట్టి వారికి ఆహారము దొరుకుతుంది. నా అదృష్టంకొద్దీ ఈ రోజు మీరు అందరూ నాకు ఆహారము అవుతున్నారు. ముందు ఏ వానరుని భక్షించాలో చెప్పండి. కోరుకునే అవకాశము మీకే ఇస్తున్నాను." అని అన్నాడు సంపాతి.
సంపాతి మాటలు విన్న అంగదుడు హనుమంతుని చూచి దు:ఖంతో ఇలా అన్నాడు. “హనుమా! మనము చావాలని అనుకున్నాము. సాక్షాత్తు యమధర్మరాజు ఈ పక్షిరూపంలో మనవద్దకు వచ్చాడు. మనము రాముని కార్యము సాధించలేకపోయాము. రాజాజ్ఞను పాటించలేకపోయాము. ఇప్పుడు ఈ ఆపద వచ్చింది.
రామునికి జటాయువు ఎలాంటి సాయం చేసాడో మీకంతా తెలుసు. ధర్మాత్ముడు అయిన జటాయువు సీతను రక్షించడం కోసరం తన ప్రాణాలనే బలి పెట్టాడు. ఒక్క జటాయువే కాదు, జంతువులు అన్నీ రామునికి ఎంతో కొంత సాయం చేసాయి. మోరలెత్తి రావణుడు వెళ్లిన మార్గము చూపించాయి. కాబట్టి మనం కూడా రాముని కొరకు మన పాణాలను విడిచిపెడదాము. సీతాన్వేషణలో మన ప్రాణాలను త్యాగం చేద్దాము.
ఆ నాడు జటాయువుకు సుగ్రీవుని భయం లేదు. ఎలాంటి స్వార్ధం లేకుండా రావణునితో యుద్ధం చేసి రామునికి సాయం చెయ్యడం కోసరం తన ప్రాణాలు త్యాగం చేసాడు. ఉత్తమగతిని పొందాడు. కాబట్టి మనం కూడా రాముని కార్యము కొరకు ప్రాణత్యాగము చేసి ఉత్తమగతులను పొందుతాము. రాముని కొరకు ఆయన తండ్రి దశరథుడు మరణించాడు. రాముని కొరకు జటాయువు మరణించాడు. మనమూ అదేమార్గాన్ని అనుసరిద్దాము.” అని అన్నాడు అంగదుడు.
ఆ మాటలు విన్నాడు సంపాతి. వారి మాటలలో తన అన్న జటాయువు ప్రసక్తి రావడం గమనించాడు. తాను కూడా దు:ఖిస్తూ ఇలా అన్నాడు.
“జటాయువు నా సోదరుడు. నేను నా సోదరుని నా ప్రాణం కన్నా అధికంగా ప్రేమిస్తాను. నా సోదరుడు జటాయువు గురించి మాట్లాడే మీరు ఎవరు? జటాయువు చావడం ఏమిటి? జటాయువుకు రావణునికి యుద్ధం జరగడం ఏమిటి? ఎందుకు జరిగింది? జటాయువు మిత్రుడు దశరథ మహారాజు ఎలా మరణించాడు? జటాయువు గురించిన సమాచారము చాలా కాలము తరువాత ఇప్పుడే వింటున్నాను. మీరు నా సోదరుని గురించి మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. దండకారణ్యంలో జనస్థానంలో సుఖంగా జీవిస్తున్న నా సోదరుడు జటాయువు ఎలా మరణించాడో వివరంగా చెప్పండి. ఆయన మిత్రుడు దశరథుని గురించి చెప్పండి. మిత్రులారా! సూర్యుని కిరణముల వేడికి నా రెక్కలు కాలిపోయాయి. నేను కదలలేను. నన్ను ఈ పర్వతశిఖరము మీది నుండి కిందికి దింపండి." అని అన్నాడు సంపాతి.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము యాభై ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment