శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ముప్పది నాలుగవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 34)

శ్రీమద్రామాయణము

కిష్కింధా కాండము

ముప్పది నాలుగవ సర్గ

లక్ష్మణుని చూడగానే సుగ్రీవుడు తన ఆసనమునుండి కిందికి దిగాడు. అతని తోపాటు అతని భార్యలు రుమ మొదలగు స్త్రీలు కూడా లేచి నిలబడ్డారు. సుగ్రీవుడు చేతులు జోడించి లక్ష్మణుని
ఎదురుగా నిలబడ్డాడు. స్త్రీల మధ్య నిలబడ్డ సుగ్రీవుని చూచి లక్ష్మణుడు కోపంతో ఇలా అన్నాడు.

“ఓ సుగ్రీవా! బలవంతుడు, ఉత్తములైన బంధువులు ఉన్నవాడు, జాలి, దయకలవాడు, ఎల్లప్పుడు సత్యమునే పలుకువాడు, అయిన రాజు లోకములో అందరిచేతా పూజింపబడతాడు. ధర్మము తప్పినవాడు, ఇచ్చిన మాటను మరచువాడు, అసత్యము పలుకువాడు అయిన రాజు కంటే క్రూరుడు మరొకడు ఉండడు.

అశ్వమును దానము చేస్తాను అని చెప్పి దానం చేయకుండా ఉన్నవాడు నూరు అశ్వములను చంపిన పాపమును పొందుతాడు. అలాగే గోవును దానం చేస్తాను అని చెప్పి మాటతప్పితే వాడికి వేయి గోవులుచంపిన పాపం అంటుకుంటుంది. అలాగే మిత్రునికి ఇచ్చిన మాట తప్పినవాడికి బంధు మిత్రులను చంపి, తనను తాను చంపుకున్న పాపం అంటుకుంటుంది. తన పని పూర్తి అయిన తరువాత, తనకు సాయం చేసిన మిత్రులకు ప్రత్యుపకారముచేయని కృతఘ్నుని జనం అంతాకొట్టి చంపుతారు. చేసిన మేలు మరచి పోయే కృతఘ్నుని గురించి బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు విను. 

“గోవును చంపిన వానికి, మద్యము తాగిని వానికి, దొంగతనము చేసిన వానికి, ప్రాయశ్చిత్తము కలదుకానీ, చేసిన మేలు మరచిపోయిన కృతఘ్నునికి ఎలాంటి ప్రాయశ్చిత్తములేదు". ఇది బ్రహ్మవాక్కు.

ఓ సుగ్రీవా!ముందు నీ పని పూర్తి చేసుకున్నావు. ఇప్పుడు రాముని పని చేయడానికి ఉత్సాహం చూపడం లేదు. నీవు అసత్యము పలికేవాడివి. కృతఘ్నుడవు. దుర్మార్గుడవు. నీవు కోరిన ప్రకారము రాముడు నీ అన్న వాలిని చంపి నీకు రాజ్యమును, నీ భార్యను ఇప్పించాడు. నీవు కూడా నీవు చేసిన ప్రతిజ్ఞ ప్రకారము సీతను వెదకడంలో రామునికి సాయం చెయ్యాలి కదా! కానీ నీవు నీ పతిజ్ఞను నిలుపుకోకుండా, ఇలాస్త్రీలతో సుఖించడం మంచిదా! నీవు ఇలాంటివాడివి అని రామునికి తెలియదు. తెలిస్తే నీతో స్నేహం చేసేవాడే కాదు. నీ వంటి దుర్మార్గుడిని, అసత్యవాదిని, పాపాత్ముడిని, చెడ్డ బుద్ధి కలవాడిని ఈకిష్కింధకు రాజును చేసేవాడే కాదు.

ఓ సుగ్రీవా! నీవు, రాముడు నీకు చేసిన మేలు గుర్తుంచుకొని, ప్రత్యుపకారము చేయకపోతే, నీవు కూడా వాలిని కలుసుకుంటావు. నీకు రాముని ధనుస్సునుండి వెలువడిన బాణము శక్తి ఇంకా తెలిసినట్టు లేదు. అందుకే రామునికి ఇచ్చిన మాట మరిచి హాయిగా కామసుఖాలలో తేలియాడుతున్నావు." అని సుగ్రీవుని తన వాడి అయిన మాటలతో హెచ్చరించాడు లక్ష్మణుడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము ముప్పదినాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)