శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - డెబ్బది మూడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 73)

శ్రీమద్రామాయణము

అరణ్య కాండము

డెబ్బది మూడవ సర్గ

కబంధుడు ఇంకా రామునితో ఇలా అన్నాడు. “ఓ రామా! నీవు ఇక్కడి నుండి పశ్చిమ దిక్కుగా వెళ్లు. నీకు దారిలో ఫలవృక్షములు, పూలు సమృద్ధిగా పూచే చెట్లు కనిపిస్తాయి. నీవు ఆ వనము దాటిన తరువాత మరొక వనము కనిపిస్తుంది. ఆ వనములో ఉన్న వృక్షములు అన్ని ఋతువులలోనూ పూలు, పండ్లు ఇస్తాయి. అదీ ఆ వనము మహాత్యము. మీరు ఆ వనము దాటితే పంపా సరోవరము
చేరుకుంటారు.

ఆ పంపా సరస్సు కలువలతోనూ, పద్మములతోనూ నిండుగా ఉంటుంది.. ఆ సరస్సులో హంసలు, క్రౌంచపక్షులు, ఇంకా ఇతర రకములైన పక్షులు సమృద్ధిగా ఉంటాయి. మీరు ఆ వనములో ఉన్న పండ్లను, సరస్సులో ఉన్న చేపలను తిని ఆ సరస్సులో ఉన్న నీరు తాగి మీ ఆకలి దప్పులు తీర్చుకోవచ్చును. మనోహరమైన ఆ వనములో ప్రవేశించగానే నీ శోకము తీరిపోతుంది.
పూర్వము ఆ వనములో మతంగ మహాముని శిష్యులు నివసించేవారు. ఆ శిష్యులు తమ గురువుగారికి కావలసిన సమిధలు, పండ్లు పూలు తెచ్చేటప్పుడు వారి శరీరమునుండి కారిన చెమట వలన ఆ వనములో పండ్ల చెట్లు పూల చెట్లు మొలిచాయి. అందుకని ఆ చెట్లకు పూచిన పూలు ఎప్పటికీ వాడిపోవు.

ఆ మతంగ మహాముని శిష్యులైన ఋషులకు సేవ చేసిన శబరి అనే సన్యాసిని ఇంకా ఆ వనములో నివసిస్తూ ఉంది. ఆ శబరి నీ దర్శనము కోసరం ఎదురు చూస్తూ ఉంది. నీ దర్శనభాగ్యము కలిగిన తరువాత ఆమె పరలోకము చేరుకుంటుంది.

ఆ పంపా సరస్సు పశ్చిమంగా ఒక ఆశ్రమము ఉంది. ఆ ఆశ్రమములో ఇప్పటికీ మతంగ మహాముని ఏర్పరచిన నియమాలు పాటింపబడుతున్నాయి. ఆ ఆశ్రమమును అడవి జంతువులు గానీ ఇతరులు గానీ పాడు చేయలేరు.

పంపా సరస్సు పక్కనే ఋష్యమూక పర్వతము ఉంది. ఆ పర్వతము మీద చిన్న చిన్న ఏనుగులు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. ఆ పర్వతము బ్రహ్మచే సృష్టింపబడినది అని అంటారు. ఆ పర్వతము మీద నిద్రించిన వారికి స్వప్పములో ఏమి కనిపిస్తుందో మెలుకువ రాగానే అది లభిస్తుంది.. మనసులో చెడు ఆలోచనలు ఉన్నవారు ఆ పర్వతము ఎక్కలేరు. ఒకవేళ ఎక్కినా, నిద్రపోతున్నపుడు రాక్షసులు వారిని చంపుతారు. ఆ ఋష్యమూక పర్వతముమీద ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహలోనే సుగ్రీవుడు తన అనుచరులతో నివసిస్తున్నాడు. సుగ్రీవుడు అతని నలుగురు అనుచరులు అప్పుడప్పుడు పర్వత శిఖరము మీద కు వచ్చి కొంతసేపు విహరించి మరలా గుహాంతర్భాగమునకు వెళు తుంటారు. నీవు వెంటనే వెళ్లి ఆ సుగ్రీవుని కలుసుకో. అతనితో మైత్రి చెయ్యి. నీకు శుభం కలుగుతుంది." అని పలికాడు కబంధుడు.

తరువాత కబంధుడు తన లోకమునకు వెళ్లిపోయాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము డెబ్బదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)