శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - పదకొండవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 11)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

పదకొండవ సర్గ

దశరథమహారాజు చేత అడిగించుకొని బతిమాలించుకొని తుదకు కైక లేచి కూర్చుంది. మన్మధ బాణములకు బలి అయిన, తన మీది కామానికి దాసోహం అన్న, తన భర్త దశరథమహారాజుతో ఇలా
అంది.

“మహారాజా! మీరు అన్నట్టు నన్ను ఎవరూ బాధించలేదు. ఎవరూ అవమానించలేదు. నాకు మిమ్మల్ని కొన్ని వరములు అడగ వలెనని ఒక కోరిక కలిగింది. అది మీరు తీర్చాలి. మీరు తీరుస్తాను అని ప్రతిజ్ఞ చేస్తేనే నా కోరికల గురించి చెబుతాను. తీరా నేను అడిగిన తరువాత మీరు కాదు అంటే నా మనసుకు బాధకలుగుతుంది. మరలా మీరు నన్ను బతిమాలాలి కదా!" అని సన్న సన్నగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్టు మాట్లాడింది కైక.

ఆ మాటలకు దశరథుడు నవ్వాడు. కైక తల వెంట్రుకలు తన చేతిలోకి తీసుకొని సుతారంగా నిమురుతూ ఇలా అన్నాడు.
“ఓ నా ప్రియమైన కైకా! ఈ లోకంలో ఒక్క రాముడు తప్ప నీకన్నా ప్రియమైన వాళ్లు నాకు ఇంకెవరున్నారు చెప్పు. అందుకని నా రాముని మీద ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను. నువ్వు ఏకోరిక కోరినా దానిని తప్పకుండా నెరవేరుస్తాను. సందేహపడకుండా అడుగు. ఎందుకంటే రాముడు నాకు ఆరోప్రాణమ. నా ఐదు ప్రాణాలు లోపల ఉంటే రాముడు నాకు బయట ఉన్న ఆరో ప్రాణము. రాముని చూడనిది నేను ముహూర్త కాలం కూడా జీవించలేను. అటువంటి రాముని మీద ఒట్టుపెట్టుకొని చెబుతున్నాను. ఇంకా నన్ను నమ్మవా!

ఓ కైకా! రాముని రక్షించుకోడానికి నేను నా ప్రాణాలను, నా ముగ్గురు కుమారుల ప్రాణాలను కూడా బలిపెట్టడానికి సిద్ధంగా ఉ న్నాను. అటువంటి రాముని మీద ఒట్టుపెట్టుకుంటున్నాను. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు. నీ మనసులో ఏముందో తెలుసుకోడానికి నా మనసు అల్లల్లాడిపోతూ ఉంది. నా మీద దయయుంచి నీ కోరిక వెల్లడించు.

అసలు నా మీద నీకు ఎందుకింత అపనమ్మకము. నా మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి కదా! నన్ను శాసించే అధికారం నీకు ఉంది. ఇంకా విను. నేను రాముని మీదనే కాదు. నేను ఇప్పటి దాకా యజ్ఞయాగములు చేసి ఆర్జించిన పుణ్యము మీదకూడా ఒట్టుపెట్టు కొని చెబుతున్నాను. ఇంక నైనా నీ మనసులోని కోరిక బయట పెట్టు. ఇంకా నన్ను చిత్రవధ చెయ్యకు." అని దీనంగా వేడుకున్నాడు దశరథుడు.

ఆ మాటలకు ఎంతో సంతోషించింది కైక. ఇంక తన మనోరథము ఈడేరింది అని మురిసిపోయింది. మెల్లి మెల్లిగా తన మనసులోని కోరికలు దశరథుని తో వెల్లడించసాగింది.

"ఓ దశరథ మహారాజా! మీరు ఎంతో ఒట్టు పెట్టుకొన్నారు కనుక నా కోరికలు మీరు తీరుస్తారు అని నమ్మకం కుదిరింది. అదీ కాకుండా మీరు చేసిన ప్రతిజ్ఞలను అగ్నిదేవునితో సహా దేవతలందరూ సాక్షీభూతంగా విన్నారు. వారే కాదు సూర్య చంద్రులు, ఆకాశము, గ్రహములు, రాత్రింపగళ్లు, భూమి, గంధర్వులు, రాక్షసులు, నిశా చరులు, సమస్త గృహదేవతలు, ఇంకా ఇతరములైన భూతజాతులు అన్నీ వింటున్నారు. ఓ పంచభూతములారా! సకల దేవతలారా! వినండి. నాకు, నా భర్త దశరథమహారాజుగారు, పూర్వముదేవాసుర యుద్ధములలో నాకు ఇస్తాను అని వాగ్దానము చేసిన రెండు వరములు ఇచ్చుటకు అంగీకరించారు. దానికి మీరే సాక్షులు." అని పలికి కైక దశరథుని వచన బద్ధుని చేసింది. కైక ఏమి అడిగితే దానిని ఇవ్వడం తప్ప దశరథునికి మరోగత్యంతరం లేదు అన్న పరిస్థితులు కల్పించింది. కైకమీది మోహంతో దశరథుడు ఆమె అన్న మాటలకు అన్నిటికీ మరోమాట మాట్లాడకుండా తలూపుతున్నాడు.

"ఓ దశరథమహారాజా! ఒక్కసారి మీరు నేను పాల్గొన్న దేవాసుర యుద్ధము జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అప్పుడు ఏం జరిగిందో మీకు జ్ఞాపకం ఉంది కదా! ఆ యుద్ధములో మీరు ఓడిపోయే పరిస్తితి వచ్చింది. మీ రథ, గజ, తురగ, పదాతి బలములు అన్నీ నశించి పోయాయి. అప్పుడు నేను మిమ్ములను రెండు సార్లు ప్రాణాపాయము నుండి రక్షించాను. అప్పుడు మీరు నాకు రెండు వరములు ఇస్తాను అని వాగ్దానము చేసారు. మీకు గుర్తు ఉంది కదా! కాని నేను అప్పుడు ఆ వరములు కోరలేదు. నాకు ఇష్టం వచ్చినపుడు కోరుకుంటాను అని మీతో అన్నాను. మీరు సత్యవాక్పరిపాలకులు. ఆడిన మాట తప్పరు. అందుకని ఆ వరములు ఇప్పుడు కోరుకుంటున్నాను. ఆ వరములు మీరు నాకు ప్రసాదించాలి. తీరా నేను అడిగిన తరువాత మీరు ఇవ్వను అంటే నాకు ఆత్మహత్యే శరణ్యము అవుతుంది." అని నేర్పుగా దశరథుని
తన మాటల వలలో ఇరికించింది.

వలలో పడ్డ లేడిపిల్లలా అయ్యాడు దశరథుడు. కైకేయి కామ పాశములలో ఇరుక్కుపోయాడు. అన్నిటికీ తలూపాడు. “నీవు ఏం కోరితే అది ఇస్తాను. సందేహించకు” అని వాగ్దానం చేసాడు
దశరథుడు.

"ఓ దశరథమహారాజా! ఇప్పుడు నా మనసుకు స్వస్థత చేకూరింది. మీరు చేసిన వాగ్దానమును నెరవేరుస్తారు అనే నమ్మకం కుదిరింది. ఆ నాడు మీరు నాకు ఇచ్చిన వరములు కోరుకుంటున్నాను. సావధాన చిత్తులై వినండి. మీరు రేపు రాముని పట్టాభిషేకమునకు అనేక సంభారములు సమకూర్చారు కదా! ఎన్నో ఏర్పాట్లు చేసారు కదా! నగరమంతా అలంకరింపచేసారు కదా! చాలాసంతోషము. కాని ఒక చిన్న మార్పు. అదే సంభారములతో, అవే ఏర్పాట్లతో, అవే అలంకరణలతో, రేపు రామునికి బదులు నా కుమారుడు భరతునికి యౌవ్వరాజ్యపట్టాభిషేకము జరిపించండి. ఇది నేను కోరుకునే, మీరు నాకు ఇవ్వడానికి అంగీకరించిన మొదటి వరము.” అంది కైక.

దశరథునికి తలతిరిగినట్టయింది. “మరి రాముడు! రాముడు ఏమవుతాడు!" అని అప్రయత్నంగా అన్నాడు దశరథుడు. వెంటనే కైక “రాముడు పదునాలుగు సంవత్సరములు నార చీరలు కట్టుకొని అరణ్యవాసం చెయ్యాలి. అయోధ్యకు దూరంగా ఉండాలి. ఇదే నా రెండవ వరము." అని పలికింది కైక.

దశరథునికి నోటి మాట రాలేదు. ఒళ్లంతా మొద్దుబారి పోయింది. శరీరం వశం తప్పుతూ ఉంది. ఏమనాలో తోచని స్థితిలో ఉన్నాడు దశరథుడు.

కైక మరలా ఇలా అంది. “నా కుమారుడైన భరతుడు శతుభయం లేకుండా ರಾಜ್ಯಂ చేయాలి (అంటే రాముడు భరతునికి శత్రుసమానుడు అని చెప్పకనే చెప్పింది కైక). అందుకే రాముడు ఈ రోజే అరణ్యములకు వెళ్లాలి. రాముడు వనవాసమునకు వెళ్లడం నేను కళ్లారా చూడాలి. ఓ దశరథ మహారాజా! ఓ సత్యవాక్పరిపాలకా! మీరు అన్న మాట నిలబెట్టుకోండి. నా కోరికలు తీర్చండి. ఎందుకంటే సత్యమునే పలకడం, అన్న మాటకు కట్టుబడి ఉండటం ఇక్ష్వాకు వంశ రాజుల ధర్మము. అన్న మాట నిలబెట్టుకుంటే నీకు పరలోకములో సుఖశాంతులు కలుగుతాయి." అని తేల్చి చెప్పింది కైక.

(ఇంక ఈ లోకంలో నీ పని అయిపోయింది అని అప్రయత్నంగా కైక నోటినుండి వెలువడింది.).

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పదకొండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నాలుగవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 4)